👉’గాలి’ మళ్లిన ఘర్షణ.. బళ్లారి ఎస్పీ ఆత్మహత్యాయత్నం కర్ణాటక రాజకీయాల్లో సంచలనం.. గురువారం రాత్రి బళ్లారి నగరంలో స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి వర్గీయుల ఘర్షణ.
కర్ణాటక రాజకీయాల్లో సంచలనం.. గురువారం రాత్రి బళ్లారి నగరంలో స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి వర్గీయుల ఘర్షణ. మొన్నటివరకు సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య అధికార మార్పిడి వివాదంతో హాట్ హాట్ గా మారిన కర్ణాటకలో ఆ వివాదం ఎటూ తేలదేదు. ఇంతలోనే కర్ణాటక రాజ్య ప్రగతి పక్ష (కేఆర్ పీపీ) వ్యవస్థాపకుడు అయిన గాలి జనార్దన్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి వర్గాలు బళ్లారిలో ఘర్షణకు దిగాయి. గురువారం ఉదయం మొదలైన వాల్మీకి ఫ్లెక్సీ కట్టే వివాదం చినికిచినికి గాలి వానగా మారి రాత్రి వేళకు పోలీసు కాల్పుల దాక దారితీసింది. ఈ కాల్పుల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి అనుచరుడు చనిపోవడంతో ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అటువైపు ఉన్నది బీజేపీ మాజీ నేత, ప్రతిపక్ష కేఆర్ పీపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి కావడంతో సిద్ధరామయ్య ప్రభుత్వం.. బళ్లారి ఎస్పీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్యాక్ గ్రౌండ్ ఏంటి? కాల్పులకు ఆదేశించి… గాలి, నారా భరత్ రెడ్డి వర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో బళ్లారిలో గురువారం రాత్రి పోలీసులను ఆ జిల్లా ఎస్పీ పవన్ నిజ్జూర్ కాల్పులకు ఆదేశించారు. ఈ క్రమంలోనే లాఠీచార్జి కూడా చేశారు. వాస్తవానికి ఘర్షణల సమయానికి గాలి జనార్దనరెడ్డి గంగావతిలో ఉన్నారు. భరత్ రెడ్డి ఆ ప్రదేశంలో లేరు. అయితే, కార్యకర్తల మధ్య వివాదం తీవ్రం అవుతున్న సమయంలో లాఠీచార్జినే కాక ఏకంగా ఫైరింగ్ ఆర్డర్ ఇవ్వడం.. అందులో అధికార కాంగ్రెస్ కార్యకర్త చనిపోవడం, మరొకరు తీవ్రంగా గాయపడడంతో ఎస్పీ బాధ్యుడు అయ్యారు. సస్పెండ్ చేసిన ప్రభుత్వం బళ్లారి ఘర్షణల నేపథ్యంలో.. ఎస్పీ పవన్ నిజ్జూర్ ను సిద్ధరామయ్య సర్కారు సస్పెండ్ చేసింది. కానీ, ఈ చర్యను ఆయన తట్టుకోలేకపోయారు. మనస్తాపానికి గురై ఆత్మహత్యా యత్నం చేశారు. కాగా, అఖిల భారత సర్వీసు అధికారులు అయినప్పటికీ కర్ణాటకలో విధి నిర్వహణ అధికారులకు ఎప్పుడూ కత్తిమీద సామే. గతంలో తెలుగు ఐఏఎస్, ఐపీఎస్ మహిళా అధికారులు ఘర్షణకు దిగారు. దీనికిముందు ఓ యువ సివిల్ సర్వెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇప్పుడు ఏకంగా ఓ ఎస్పీనే ఆత్మహత్యాయత్నం చేశారు.
👉పుష్పగుచ్ఛాలకు బదులు పుస్తకాలు…పల్నాడు జిల్లా అధికారుల ఆదర్శవంతమైన నూతన సంవత్సర వేడుకలు… పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ఇచ్చిన పిలుపు సాకారమైంది. శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చే వారు పుష్పగుచ్ఛాలకు (Bouquets) బదులుగా పుస్తకాలను బహుకరించాలని ఆమె కోరగా, జిల్లా అధికారులు ఆ పిలుపును స్ఫూర్తిగా తీసుకున్నారు.కలెక్టరేట్లో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో జిల్లాలోని వివిధ శాఖల అధికారులు కలెక్టర్ కి పుస్తకాలతో శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో మొత్తం 1300 నోటు పుస్తకాలు, డిక్షనరీలు, పెదబాల శిక్షలు, పాఠశాల మరియు కళాశాల విద్యార్థులకు ఉపయోగపడే వివిధ రకాల స్టడీ మెటీరియల్స్ను కలెక్టర్కు అందజేశారు.
*విద్యార్థులకు చేరనున్న జ్ఞాన నిధి… అధికారుల నుంచి అందిన ఈ పుస్తకాలను సద్వినియోగం చేస్తామని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. వీటిని వివిధ ప్రభుత్వ వసతి గృహాల (Hostels) విద్యార్థులకు పంపిణీ చేస్తారు. “పుష్పగుచ్ఛాలు కొద్దిసేపటికే వాడిపోతాయి, కానీ పుస్తకాలు ఎందరో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి. ఈ సంప్రదాయం విద్యార్థులలో పఠనాసక్తిని పెంపొందిస్తుంది.” అని కలెక్టర్ కృతిక శుక్లా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.పర్యావరణానికి మేలు చేస్తూ, విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పడేలా కలెక్టర్ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
👉ఉస్మానియా యూనివర్సిటీలో నాసిరకం భోజనం పెడుతున్నారని రోడెక్కిన లా కాలేజీ విద్యార్థులు*
గత నెల రోజుల నుండి నాసిరకం భోజనం పెడుతున్నారని, ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా గాలికి వదిలేశారని నిరసన తెలిపిన లా కాలేజీ హాస్టల్ విద్యార్థులు…
👉 దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం… ఇంద్రధనస్సు లాంటి ఏడు వరాలే ఇందుకు నిదర్శనం…. చిత్తశుద్ధితో నిర్ణయాలను, హామీలను మా ప్రభుత్వం అమలు చేస్తున్నది… రాష్ట్ర సాంఘిక, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి వెల్లడి… లూయిస్ బ్రెయిలీ జయంతి సందర్భంగా ఒంగోలులో ఆయన విగ్రహానికి ఘన నివాళి అర్పించిన మంత్రి… కలెక్టరేట్లో అట్టహాసంగా జయంతి వేడుకలు…’ స్వచ్చాంధ్ర ‘ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో చెత్త తరలింపు కోసం ఈ-ఆటోలు, పుష్ కార్టులు పంపిణీ చేసిన మంత్రి స్వామి. దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక, దివ్యాంగుల సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి చెప్పారు. లూయిస్ బ్రెయిలీ 217వ జయంతిని పురస్కరించుకుని ఆదివారం కలెక్టరేట్లో జరిగిన రాష్ట్రస్థాయి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ డైరెక్టర్ బి.రవి ప్రకాష్ రెడ్డి, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ సంస్థ చైర్ పర్సన్ గుడిపూటి నారాయణస్వామి, జిల్లా రెవెన్యూ అధికారి బి.చిన ఓబులేసు, దివ్యాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు సీ.హెచ్.సువార్త, ఇతర ప్రముఖులతో కలిసి ముందుగా కలెక్టరేట్ వద్ద ఉన్న బ్రెయిలీ విగ్రహానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు.
అనంతరం కలెక్టరేట్లో నిర్వహించిన వేడుకల్లో మంత్రి మాట్లాడుతూ బ్రెయిలీ స్ఫూర్తితో దృష్టిలోపం, ఇతర దివ్యాంగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ‘ ఇంద్రధనస్సు ‘ లాంటి 7 వరాలను ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దివ్యాంగుల కోసం ప్రకటించారన్నారు. ఆర్టీసీ బస్సులలో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం, స్థానిక సంస్థలు, ఇతర కార్పొరేషన్లలో దివ్యాంగులకు నామినేషన్ ప్రాతిపదికన ప్రాతినిధ్యం, ఆర్థిక సబ్సిడీ పథకాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర మైనార్టీలకు మాదిరిగానే దివ్యాంగులకు కూడా అందించడం, శాప్ ద్వారా అన్ని క్రీడా కార్యక్రమాలు, నైపుణ్య అభివృద్ధి పథకాలను దివ్యాంగులకు కూడా అందుబాటులోకి తేవడం, టిట్కో వంటి బహుళ అంతస్తులు కలిగిన ప్రభుత్వ హౌసింగ్ పథకాలలో దివ్యాంగులకు గ్రౌండ్ ఫ్లోర్లో ప్లాట్ల కేటాయింపు, బాపట్లలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కాలేజీతో పాటు వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక డిగ్రీ కాలేజీ ఏర్పాటు, ఏపీ రెసిడెన్షియల్ కాలేజీల్లో చదువుకుంటున్న దివ్యాంగ విద్యార్థులకు అక్కడే భద్రత పెన్షన్ల పంపిణీ చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అమలు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులను మార్చి నెలాఖరులోగా భర్తీ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. సమస్యలను సత్వరమే పరిష్కరించేలా, సంక్షేమ కార్యక్రమ ఫలాలను లబ్ధిదారులకు వేగంగా అందించేలా త్వరలోనే దివ్యాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకుల పోస్టుల్లో ఒక జిల్లాలో చూపులోపం ఉన్న అధికారికి పోస్టింగ్ కూడా ఇస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో దివ్యాంగులకు ప్రత్యేక ఉపకరణాలను అందిస్తున్నామన్నారు. క్రీడల్లో రాణిస్తున్న దివ్యాంగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. చూపులోపం ఉన్నప్పటికీ ఇటీవల విశేష ప్రతిభ చూపిన క్రికెటర్లు కరుణ కుమారి, దీపికలను ఏకంగా ముఖ్యమంత్రి అభినందించి, ప్రోత్సాహకాలను ప్రకటించిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. దివ్యాంగులను అవహేళన చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. జిల్లాలో దివ్యాంగుల కోసం హాస్టళ్ళు నిర్మించేందుకు అవసరమైన స్థలం కేటాయించాలని ఇప్పటికే కలెక్టర్ ను కోరినట్లు ఆయన చెప్పారు. విద్య, ఉద్యోగం, ఇతర అవసరాల కోసం ఉపయోగపడే యు.డి.ఐ.డి. కార్డులను దివ్యాంగులందరూ తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు. డైరెక్టర్ రవి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ అంధులకు అక్షరజ్ఞానం ప్రసాదించి, ఆత్మవిశ్వాసం నింపిన మహనీయులు బ్రెయిలీ అని కొనియాడారు. ఆయా వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని తెలియజేసేలా రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. మంత్రి సూచన మేరకు ప్రకాశం జిల్లాను వేదికగా ఎంపిక చేసినట్లు తెలిపారు…నారాయణస్వామి మాట్లాడుతూ దివ్యాంగుల కోసం ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసేలా చర్యలు తీసుకోవడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. డిఆర్ఓ మాట్లాడుతూ దివ్యాంగులకు సింగిల్ రేషన్ కార్డు జారీ చేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపించామన్నారు. బస్సులలో దివ్యాంగులకు కేటాయించిన సీట్లలో వారినే కూర్చొనిచ్చేలా గట్టి చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులకు లేఖ రాస్తామని చెప్పారు. ఉద్యోగ ఖాళీల భర్తీలో రోస్టర్ పాయింట్ల అమలులో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూస్తానని స్పష్టం చేశారు. దివ్యాంగులకు ఇళ్ల స్థలాల కేటాయింపుల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక దృష్టి సారిస్తానని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు…విజువల్లి ఛాలెంజెడ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు జి.రవీంద్రబాబు, నేషనల్ ఫెడరేషన్ ఫర్ ది బ్లైండ్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.రామసుబ్బయ్య, విజువల్లి ఛాలెంజ్డు అన్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రతన్ రాజు, అర్జున్ అవార్డు గ్రహీత అజయ్ కుమార్ రెడ్డి, దివ్యాంగ ఉద్యోగుల ప్రకాశం జిల్లా అసోసియేషన్ ప్రతినిధులు, బాపట్ల జిల్లా అసోసియేషన్ ప్రతినిధులు, గుడ్ న్యూస్ బ్లైండ్ స్కూల్ విద్యార్థులు, సూర్య చారిటబుల్ ట్రస్ట్, ఇతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొని ప్రసంగించారు. దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 8 మంది విద్యార్థులకు ఈ సందర్భంగా మంత్రి చేతుల మీదుగా ల్యాప్ టాప్ లు పంపిణీ చేశారు. లూయిస్ బ్రెయిలీ క్యాలెండర్ ను, దివ్యాంగ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండరును కూడా ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
👉ఎన్టీఆర్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి..ప్రకాశం జిల్లా కంభం…
ఈ నెల 18 వ తేదీన తెలుగువారి ఆరాధ్యదైవం, మాజీ ముఖ్యమంత్రివర్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్బంగా కంభం ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో “మార్కాపురం డివిజన్ క్రికెట్ అసోసియేషన్” వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ను ఆదివారం ఉదయం గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై లాంఛనంగా ప్రారంభించారు…మైదానంలో క్రీడాకారులను కలిసి వారితో ముచ్చటించి శుభాకాంక్షలు తెలుపుతూ, క్రీడా స్ఫూర్తితో రాణించాలని ఆకాంక్షించారు..ఎన్టీఆర్ వంటి మహానీయుని వర్ధంతి సందర్భంగా యువతను ప్రోత్సహించేలా క్రికెట్ టోర్నమెంట్ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి క్రీడా పోటీలు ఎంతో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. ఇంతటి చక్కని కార్యక్రమాన్ని చేపట్టిన మార్కాపురం డివిజన్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తోట శ్రీనివాసరావు మార్కెట్ యార్డ్ చైర్మన్ పూనూరు భూపాల్ రెడ్డి, జడ్పీటీసీ సభ్యులు కొత్తపల్లె శ్రీను, సొసైటీ బ్యాంకు చైర్మన్ కేతం శ్రీను, పార్లమెంట్ ఉపాధ్యక్షులు బిజ్జాల కిషోర్, రాష్ట్ర ఎడ్యుకేషన్ & సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ చెన్నకేశవులు, పట్టణ అధ్యక్షులు ఓబుళరెడ్డి మాధవ్ సీఐ మల్లిఖార్జున, ఎస్సై కృష్ణారెడ్డి, స్థానిక మండల స్థాయి నాయకులు, ప్రజా ప్రతినిధులు, నిర్వాహకులు క్రీడా సంఘం ప్రతినిధులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.

