👉మీకు, మాకు కటీఫ్.. తేల్చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అయితే తమకు డిప్యూటీ సీఎం పవన్ న్యాయం చేస్తారని ఆశించిన వారికి ఆయన కూడా రిక్తహస్తం చూపారు. మీకు, మాకు సంబంధమే లేదంటూ తేల్చేయడంతో వలంటీర్లు ఉసూరుమంటున్నారు.
కూటమి ప్రభుత్వంలోని అత్యంత కీలక నేత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఆయన ఓ మాట అన్నారంటే అదే విధాన నిర్ణయమన్నట్లు అమలు అవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కి అంతే ప్రాధాన్యమిస్తున్నారు. యువనేత లోకేశ్ తోపాటు మంత్రివర్గంలోని ఇతర మంత్రులు కూడా పవన్ పై పూర్తి నమ్మకం ఉంచుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయనతో తమ సమస్య చెప్పుకుంటే పరిష్కారమవుతుందని ఆశించారు వలంటీర్లు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కీలకంగా పనిచేసిన వలంటీర్లను కూటమి ప్రభుత్వం వచ్చాక తొలగించిన విషయం తెలిసిందే. అయితే తమకు డిప్యూటీ సీఎం పవన్ న్యాయం చేస్తారని ఆశించిన వారికి ఆయన కూడా రిక్తహస్తం చూపారు. మీకు, మాకు సంబంధమే లేదంటూ తేల్చేయడంతో వలంటీర్లు ఉసూరుమంటున్నారు. విశాఖ ఏజెన్సీలోని అరకు నియోజకవర్గంలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వలంటీర్ వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం వస్తే వలంటీర్లను కొనసాగించడంతోపాటు రూ.10 వేలు వేతనం చేస్తామని హామీని కొంతమంది వలంటీర్లు ఆయనకు గుర్తు చేయగా, తాము అధికారంలోకి రాక ముందు వలంటీర్లను కొనసాగిస్తామని చెప్పడం నిజమేనని, కానీ, అధికారంలోక వచ్చాక అసలు విషయం తెలిసిందని, వలంటీర్లను గత ప్రభుత్వం కొనసాగించలేదని దీంతో తాము ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉండిపోయామని స్పష్టం చేశారు. వలంటీర్లకు ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేదని చెప్పిన డిప్యూటీ సీఎం గత ప్రభుత్వం వలంటీర్లకు ఏ పద్దు కింద జీతాలు చెల్లించిందో కూడా తెలియడం లేదని వెల్లడించారు. ప్రభుత్వానికి సంబంధం లేకుండా వలంటీర్ వ్యవస్థను నడపడమే కాకుండా, వారిని మభ్య పెట్టారని ఆరోపించారు. వలంటీర్ వ్యవస్థను తిరిగి తీసుకొద్దామంటే అధికారికంగా ఎలాంటి ఆప్షన్ లేకుండా చేశారని డిప్యూటీ సీఎం పవన్ స్పష్టం చేయడంతో వలంటీర్లు ఉసూరుమన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వలంటీర్ వ్యవస్థకు ముగింపు పలికారు. 2023 ఆగస్టు తర్వాత వలంటీర్లను రెన్యువల్ చేయకపోవడంతో తాము ఏమీ చేయలేమని ప్రభుత్వం వైసీపీపై నెపం నెట్టడంతో వలంటీర్ల ఉద్యోగాలు ఊడిపోయాయి. నెలకు రూ.5 వేల గౌరవ వేతనంతో 50 ఇళ్లకు ఒకరి చొప్పున గత ప్రభుత్వం వలంటీర్లను నియమించిన విషయం తెలిసిందే. తమ పార్టీకి అనుకూలంగా ఉన్నవారినే వలంటీర్లుగా నియమించుకున్నామని అప్పట్లో వైసీపీ నేతలు ప్రకటించడం వల్ల కూటమి ప్రభుత్వం వారిని పక్కన పెట్టేసిందని చెబుతున్నారు. అంతేకాకుండా గతంలో విపరీతమైన రాజకీయ వివాదాలకు వలంటీర్లే కేంద్రంగా ఉండటంతో కూటమి ప్రస్తుతం ఆ వ్యవస్థ జోలికి వెళ్లడం లేదు..అసెంబ్లీ, శాసనమండలి వేదికగా పలుమార్లు వలంటీర్ వ్యవస్థ లేదని చెప్పిన ప్రభుత్వం వైఖరి మార్చుకుంటుందేమోనని ఇన్నాళ్లు వలంటీర్లు ఎదురుచూశారు. డిప్యూటీ సీఎం పవన్ చెబితే సీఎం చంద్రబాబు పునరాలోచన చేస్తారని భావించారు. దీంతో పవన్ ను నేరుగా కలిసిన కొందరు వలంటీర్లు తమ సమస్యలను నివేదించారు. అయితే ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లే డిప్యూటీ సీఎం కూడా చేతులెత్తేయడంతో వలంటీర్ల కొనసాగింపు అనేది ఉండదని మరోసారి స్పష్టం చేసినట్లైందని అంటున్నారు.
👉వై.ఎస్. జగన్ కు వార్నింగ్ ఇచ్చిన ఎస్ఐ.! .. జగన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై పోలీసు వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. రామగిరి ఎస్సై సుధాకర్ జగన్ వ్యాఖ్యలకు ఘాటుగా సమాధానమిచ్చారు.. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పోలీసులపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు కలకలం రేపాయి.
రాప్తాడు నియోజకవర్గ పర్యటనలో ఆయన మాట్లాడుతూ పోలీసులను బట్టలు ఊడదీయించి కొడతామని హెచ్చరించారు. టీడీపీ ప్రభుత్వం ఎల్లకాలం అధికారంలో ఉండదని, చంద్రబాబు నాయుడుకు ఊడిగం చేసే పోలీసు అధికారులకు శిక్ష తప్పదని ఆయన అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అలాంటి పోలీసులపై చర్యలు తీసుకుంటామని, వారి యూనిఫామ్లు తీయించి చట్టం ముందు నిలబెడతామని, ఉద్యోగాలు కూడా లేకుండా చేస్తామని జగన్ తీవ్రంగా హెచ్చరించారు. టీడీపీ నాయకుల అరాచకాలతో రాష్ట్రంలో బిహార్ లాంటి పరిస్థితులు నెలకొన్నాయని జగన్ విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల ఉప ఎన్నికలలో వైసీపీ కార్యకర్త లింగమయ్యను టీడీపీ గూండాలు చంపడం దారుణమని, ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన కొనసాగుతోందని, శాంతి భద్రతలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు గాలికొదిలేశారని ఆయన ప్రశ్నించారు. రాప్తాడు నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాలు రెడ్బుక్ పాలనకు నిదర్శనమని జగన్ పేర్కొన్నారు. గతంలో కూడా ఐదుసార్లు జగన్ పోలీసులను నేరుగా బెదిరించారని సమాచారం.. జగన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై పోలీసు వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. రామగిరి ఎస్సై సుధాకర్ జగన్ వ్యాఖ్యలకు ఘాటుగా సమాధానమిచ్చారు. “యూనిఫాం నువ్వు ఇస్తే వేసుకున్నది కాదు. కష్టపడి చదివి.. రన్నింగ్ రేసుల్లో, చదివి పాస్ అయ్యి ఎన్నో వేల మందిని దాటి పోటీపరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫాం ఇదీ.. మేం ప్రజల పక్షాన నిజాయితీగానే పనిచేస్తాం.. నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం.. నిజాయితీగానే చస్తాం.. అడ్డమైన దారులు తొక్కం.. నువ్వు వచ్చి ఊడదీస్తా అంటే ఇది అరటితొక్క కాదు జాగ్రత్తగా మాట్లాడు” అంటూ ఎస్సై సుధాకర్ వ్యాఖ్యానించడం ఇప్పుడు జగన్ వ్యాఖ్యలకన్నా పెద్ద సంచలనంగా మారింది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి చేసిన ఈ హెచ్చరికలు, దానికి పోలీసు అధికారి స్పందించిన తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. రానున్న రోజుల్లో ఈ పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సి ఉంది..
👉కేజీ రైస్ కు రూ.43/- ఖర్చు.., రూ.10/-కి అమ్ముకోవడం దారుణం: మంత్రి నాదెండ్ల మనోహర్*
*సన్నబియ్యం విషయంలో తెలంగాణతో పోటీపడబోమని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.. *రాష్ట్రంలో అందించేది నాణ్య మైన బియ్య మని అందుకుగాను కేజీ రైస్ కు రూ.43 ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఈ మొత్తంలో కేంద్రం 61, రాష్ట్రం 39శాతం భరిస్తోందని పేర్కొన్నారు. ఇంత ఖర్చుచేసి పేదలకు బియ్యం అందిస్తుంటే వాటిని రూ.10కి అమ్ముకోవడం దారుణమన్నారు. బియ్యం రీ సైక్లింగ్ కాకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని మంత్రి పేర్కొన్నారు..*
👉పల్లె నిద్ర కార్యక్రమంలో గిద్దలూరు అర్బన్ సీఐ సురేష్*. … గిద్దలూరు మండలం ఉయ్యాలవాడ గ్రామంలోని మండల ప్రాధమిక పాఠశాల.. ఆవరణంలో గిద్దలూరు అర్బన్ సీఐ సురేష్ మంగళవారం రాత్రి పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన గ్రామస్తులకు, యువకులుకు, పలు సూచనలు చేశారు. ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పి సైబర్ మోసగాళ్లు తో జాగ్రత్తగా ఉండాలని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమం లో మార్కెట్ యార్డ్ చైర్మన్ బాలయ్య , ఆదిమూర్తిపల్లె మాజీ సర్పంచ్ రామకృష్ణ, ముండ్లపాడు వైస్ సర్పంచి శేషగిరిరావు, టీడీపీ నాయకులు ఎం చంద్ర శేఖర్ యాదవ్, దాసరి విజయరాజు , సుబ్బారావు, వెంకటేశ్వర్లు, ఫీల్డ్ అసిస్టెంట్ మనోహర్, పాపయ్య వీరారెడ్డి, ఓర్సు శేషయ్య, ఉయ్యాలవాడ గ్రామస్తులు పాల్గొన్నారు
👉 లోక్కు రమేష్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు*
గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సోదరుడు కృష్ణ కిషోర్ రెడ్డి జన్మదిన సందర్భంగా 11వ వార్డు కౌన్సిలర్ లోక్కు రమేష్ ఆధ్వర్యంలో కృష్ణ కిషోర్ రెడ్డి చేతుల మీదుగా గవర్నమెంట్ హాస్పిటల్ ఆవరణలోచలివేంద్రంనుప్రారంభోత్సవం చేశారు. హాస్పిటల్ కు వచ్చే ప్రజలు మంచినీటి కోసం ఇబ్బంది పడకుండా ఉండాలని వేసవి కాలం దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం నిర్వహించినందుకు రమేష్ ను కృష్ణ కిషోర్ రెడ్డి అభినందించారు.. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు గవర్నమెంట్ హాస్పటల్ సూపరిండెంట్ ఆదాం , హాస్పిటల్స్ సిబ్బంది మరియు గిద్దలూరు పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

