👉ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి.. *30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సోషల్ వెల్ఫేర్ కాలేజీ హాస్టల్ వార్డెన్ నాగమణి..* *ఏలూరు జిల్లా: నూజివీడు.* ఏలూరు జిల్లా నూజివీడు పట్టణం లో ఎంప్లాయిస్ కాలనీలో గురువారం రాత్రి ఏసీబీ రైడింగ్ తీవ్రసంచలనం కలిగించింది…* సోషల్ వెల్ఫేర్ కాలేజీ హాస్టల్ వార్డెన్ నాగమణి 30 వేల రూపాయలు నగదు లంచం తీసుకుంటూ పట్టుపడ్డారు..* హాస్టల్లో స్వీపర్ గా విధులు నిర్వర్తిస్తున్న ఝాన్సీ అనే ఉద్యోగి నుండి లంచం డిమాండ్ చేయడంతో ఏలూరు లో ACB ని ఆశ్రయించినట్లు ఎసిబి డిఎస్పి సుబ్బరాజు వెల్లడించారు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ ఏసిబి డిఎస్పి సుబ్బరాజు వివరించారు..* ఈ కేసు దర్యాప్తులో ఏలూరు ఏసీబీ సీఐ ఎం బాలకృష్ణ, కే శ్రీనివాస్, రాజమండ్రి సీఐ ఎన్వి భాస్కరరావు పాల్గొన్నారు..
👉తీవ్ర భావోద్వేగానికి గురైన ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు…ఘనంగా పదవీ విరమణ వీడ్కోలు…సర్వీసులో అనేక సవాళ్లను చూశా…యూనిఫామ్ ఉండదంటేనే భావోద్వేగంగా ఉందన్న ద్వారకా తిరుమలరావు
ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ వీడ్కోలు పరేడ్ ను ఘనంగా నిర్వహించారు.
మంగళగిరిలోని ఆరో బెటాలియన్ మైదానంలో జరిగిన పరేడ్ కు రాష్ట్రంలోని ఐపీఎస్ అధికారులందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా ద్వారకా తిరుమలరావు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో ద్వారకా తిరుమలరావు ప్రసంగిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. తన జీవితంలో ఇవి ఉద్విగ్నభరిత క్షణాలు అని అన్నారు. ఇకపై యూనిఫామ్ ఉండదంటేనే భావోద్వేగంగా ఉందని చెప్పారు. సర్వీసులో చేరినప్పటి నుంచి అనేక సవాళ్లను చూశానని తెలిపారు. సంప్రదాయ పోలీసింగ్ నుంచి సాంకేతిక పోలీసింగ్ వైపు మారామని చెప్పారు. విపత్తుల సమయంలో పోలీసులు సాహసోపేతంగా పని చేశారని ప్రశంసించారు. ప్రభుత్వ సహకారం వల్లే పోలీసు వ్యవస్థను బలోపేతం చేశానని తెలిపారు. గంజాయి, చిన్నారులపై నేరాలు, సైబర్ క్రైమ్ విషయంలో చర్యలు చేపట్టామని వెల్లడించారు.నూతన డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా మాట్లాడుతూ… పోలీసు శాఖపై ద్వారకా తిరుమలరావు చెరగని ముద్ర వేశారని ప్రశంసించారు. ప్రజల భద్రత కోసం అనేక సంస్కరణలు చేపట్టారని తెలిపారు. మత్తు పదార్థాల నియంత్రణ కోసం ఈగల్ టీమ్ ను ఏర్పాటు చేశారని చెప్పారు. రాష్ట్ర డీజీపీగా తన శక్తిమేర పని చేస్తానని తెలిపారు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
👉బాబు ష్యూరిటీ.. చీటింగ్ గ్యారెంటీ: రోజా..
👉👉బాబు ష్యూరిటీ.. భవిష్యత్ గ్యారంటీ నినాదం చీటింగ్ గ్యారెంటీ అయ్యిందని మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. ‘అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ ఇస్తాం. మాట తప్పితే కాలర్ పట్టుకుని అడగమని లోకేష్ అన్నారు. ఇప్పుడు ఎవరి కాలర్ పట్టుకోవాలో చెబుతారా? మూలనున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కగలదని అప్పుడు జగన్ను చంద్రబాబు అవహేళన చేశారు. మరి ఇప్పుడు బాబు ఎందుకు బటన్ నొక్కడం లేదు’ అని రోజా ఎద్దేవా చేశారు.
👉సాక్షులు చనిపోతున్నారు – హైకోర్టులో వైఎస్ సునీత పిటిషన్..
న్యాయం చేయాలని.. కేసు విచారణ పూర్తి చేయాలని కోర్టుల్ని వేడుకోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. తన తండ్రిని అత్యంత ఘోరంగా చంపేసిన వారు హాయిగా బయట తిరుగుతున్నారని ప్రస్తుతం ఆ కేసుపై విచారణ కూడా జరగడం లేదని .. వైఎస్ వివేకా కుమార్తె సునీత ఆవేదన చెందుతున్నారు. తాజాగా ఆమె తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ట్రయల్ ప్రారంభం కాకుండా చేస్తున్నారని.. ఆరు నెలల్లో ట్రయల్ మొత్తం పూర్తిచేసేలా నాంపల్లి సీబీఐ కోర్టుకు ఆదేశాలు జారీచేయాలని పిటిషషన్లో కోరారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ అయి రెండేళ్లు దాటినా ఇంకా కేసు ట్రయల్ ప్రాథమిక దశలోనే ఉందని పిటిషన్లో కలిపారు. సీబీఐ సమర్పించిన డిస్కుల్లో 13 లక్షల ఫైల్స్ ఉండగా ఇప్పటివరకు 13,717 ఫైల్స్ మాత్రమే ఓపెన్ చేశారన్నారు. రోజుకు 500 ఫైల్స్ చొప్పున ఓపెన్ చేసుకుంటే పోతే మరో ఏడేళ్లయినా ట్రయల్ ప్రారంభం కాదని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు.
సునీత పిటిషన్లో కీలక విషయాలను పేర్కొన్నారు. సాక్షులు వరుసగా చనిపోతున్నారని గుర్తు చేశారు. సాక్షి వైఎస్ అభిషేక్రెడ్డి తాజాగా మరణించారని తెలిపారు. ట్రయల్ ప్రారంభం కాకపోతే ఇబ్బందులు వస్తాయన్నారు. ఈ పిటిషన్పై కోర్టు ఫిబ్రవరి నాలుగో తేదీన విచారణ జరపనున్నారు. వైఎస్ వివేకా కేసును కూడా జగన్ అక్రమాస్తుల కేసు తరహాలో కోల్డ్ స్టోరేజీలో పెట్టించడానికి న్యాయపరంగా ఉన్న అన్ని అవకాశాలను నిందితులు వాడుకుంటున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
👉కోడూరులో తీగలాగితే తిరుపతిలో డొంక కదిలింది!?
తిరుపతి రూరల్ దామినేడు ఇందిరమ్మ కాలనీలో శుక్రవారం సెబ్ అధికారులు మెరుపు దాడి చేయడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడింది. వివరాల్లోకెళితే..ఇటీవల అన్నమయ్య జిల్లా కోడూరు లో నకిలీ మద్యం పట్టుబడటంతో సెబ్ అధికారులు మరింత లోతుగా విచారించడంతో కొన్ని దిగ్భ్రాంతికర విషయాలు బయటపడ్డాయి. దామినేడు ఇందిరమ్మ గృహాలు వద్ద గల బి బ్లాక్ 61వ నెంబర్ ఇంటి వద్ద నకిలీ మద్యం తయారీ ముఠా గుట్టు రట్టయింది.స్పిరిట్, నకిలీ లేబుల్స్ తో బ్రాండెడ్ మద్యం తయారు చేసి తిరుపతి, కోడూరు పరిసర ప్రాంతాల్లో బెల్ట్ షాపులకు ముఠా సరఫరా చేస్తున్నారు…స్పిరిట్ 23 క్యాన్లు, నకిలీ లేబుల్స్, 6955 ఖాళీ బాటిళ్ల ను సెబ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో సూత్రధారులైన ఎం ఆర్ పల్లెకు చెందిన చికెన్ శ్రీను, మహేష్, అయ్యప్పలు అరెస్ట్ కాగా కడప జిల్లా టీ.సుండుపల్లి మండలానికి గ్రామానికి చెందిన ప్రధాన సూత్రధారి వెంకటరమణ, జయబాబు పరారీలో ఉన్నారు.ఈ దాడుల్లో కడప, చిత్తూరు ఎక్సైజ్ సూపరింటెండెంట్స్ నాగమల్లేశ్వర రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఏది ఎలా ఉన్నా 2020 నుండి నకిలీ ముఠా తమ దందా సాగుతున్నప్పటికీ పోలీసులు గుర్తించకపోవడం వెనుక పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
👉*తిరుపతి నగరంలో కుళ్ళిన చికెన్ విక్రయం…* ఫంగర్స్ వచ్చి కుళ్ళిన చికెన్ డీప్ ఫ్రీజ్ లో పెట్టి అమ్మకాలు…షాప్ను సీజ్ చేసిన అధికారులు…
తిరుపతి నగరంలోని ఒక చికెన్ దుకాణంలో కుళ్లిన చికెన్ విక్రయించడంతో అధికారులు సీజ్ చేశారు.
ఇవాళ స్థానిక చికెన్ దుకాణాల్లో కేజీ చికెన్ 220 రూపాయల నుంచి 240 రూపాయల వరకు విక్రయిస్తుండగా ఈ దుకాణంలో మాత్రం కేవలం 150 రూపాయలుకు మాత్రమే విక్రయిస్తుండటంతో మార్కెట్లోని దుకాణ యజమానులు అనుమానం వచ్చి పరిశీలించారు.చనిపోయిన కోళ్లను కట్ చేసి సుమారు పది రోజులకు పైగా డీప్ ఫ్రిజ్లో పెట్టి కుళ్లిన చికెన్ను విక్రయిస్తున్న విషయాన్ని గమనించారు.
వెంటనే మున్సిపల్ హెల్త్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు అక్కడికి చేరుకుని పరిశీలించి, కుళ్ళిన, ఫంగర్స్ వచ్చి దుర్వాసన వస్తున్న చికెన్ ప్రత్యక్షం కావడంతో ఆ చికెన్ దుకాణాన్ని సీజ్ చేశారు.
👉 కేజీవాల్ కు బిగ్ షాక్.. ఏడుగురు ఎమ్మెల్యేలు రాజీనామా…!!!
ఢిల్లీ శాసనసభ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ… ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆప్కు రాజీనామా చేశారు.ఏడుగురు ఆప్ ఎమ్మెల్యేల రాజీనామాతో కేజ్రివాల్ పార్టీకి దిమ్మతిరిగే షాక్ తగిలినట్టైంది. ఈసారి పోటీ చేసే అవకాశం ఇవ్వకపోవడం వల్లే ఈ అయిదుగురు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.ఢిల్లీ పీఠం కోసం బీజేపీ-ఆప్ మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది.
👉 అడవిని మింగిన పెద్దన్న…!అక్రమ అటవీ సామ్రాజ్యం నిర్మాణం…దట్టమైన అటవీప్రాంతంలో సువిశాల రోడ్లు…భారీ షెడ్లతో పదుల కొద్దీ ఎకరాల్లో విస్తరించిన వ్యవసాయ క్షేత్రం..
నవీనత ఉట్టిపడేటట్టుగా అత్యంత విలాసవంతమైన భవంతి… పాత్రికేయుల సమావేశంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్రెడ్డి
శ్రీకాళహస్తి : మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడవిని మింగి అక్రమ అటవీ సామ్రాజ్యం నిర్మించుకున్నారని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్రెడ్డి ఆరోపించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని పి.ఆర్.గెస్ట్ హౌస్ నందు పాత్రికేయుల సమావేశఃలో ఆయన మాట్లాడుతూ మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో చాలా దూరంగా దట్టమైన అటవీ ప్రాంతం ఉందని, ఆ అడవి మధ్యలో సువిశాలమైన రోడ్డు నిర్మించి, ఆ దారిలో పొడుగునా వెళితే వందలాది మామిడి చెట్లు, పశువుల కోసం నిర్మించిన భారీ షెడ్లతో పదుల కొద్దీ ఎకరాల్లో విస్తరించిన వ్యవసాయ క్షేత్రం విస్తరించారన్నారు. ఈ క్షేత్రంలో మరో పక్కగా నవీనత ఉట్టిపడేటట్టుగా అత్యంత విలాసవంతమైన భవంతి ఇదంతా.. మధ్యయుగాలనాటి ఫ్యూడల్ ప్రభువుల లక్షణాల్ని పుణికి పుచ్చుకున్న మాజీ మంత్రి, ప్రస్తుతం వైసీపీ పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమ అటవీ సామ్రాజ్యం అన్నారు. ప్రభుత్వ ప్రాజెక్టులకు ఒక్క చదరపు గజం అటవీ భూమి తీసుకోవాలన్నా సవాలక్ష అడ్డంకులు, వెరచి ఎన్నో రకాాల ఆంక్షలు దాటి అనుమతులు పొందాలి. అంతేకాక కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ నుంచి కూడా అనుమతి పొందాలంటే సామాన్యమైన విషయం కాదు. కానీ పెద్దిరెడ్డి ఎకరాలకొద్దీ అటవీ భూముల్ని దర్జాగా కబ్జా చేసేసి, దాన్నో వ్యవసాయ క్షేత్రంగా మార్చేసి, విలాసవంతమైన భవనం నిర్మించుకున్నాడన్నారు. అంతేకాదు అక్కడికి వెళ్ళడానికి అటవీభూమిలో ప్రభుత్వ సొమ్ముతో రహదారి కూడా నిర్మించేశారని, ఆ ప్రాంతంలోకి పెద్దిరెడ్డికి తెలియకుండా ఏ ఒక్కరు అడుగు పెట్టడానికి వీలులేకుండా కట్టుదిట్టంగా ఇనుప కంచె వేశారని తెలిపారు. పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గంలోని పులిచెర్ల మండలం మంగళంపేట సమీపంలోని అడవుల్లో.. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా నిర్మించుకున్న పెద్దిరెడ్డి అక్రమ అటవీ సామ్రాజ్యం అన్నారు.
అక్రమంగా అనుభవించడం వైసీపీ నాయకులకే చెల్లు
ఎసైన్డ్, అటవీ భూముల్ని ఆక్రమించుకుని విలాసవంతమైన భవనాలు కట్టుకుని అనుభవించడం వైకాపా నాయకుల చెల్లుతుందని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్రెడ్డి అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఇడుపులపాయలో వందల ఎకరాల ఎసైన్డ్ భూముల్ని ఆక్రమించుకుని భవంతులు కట్టుకున్నారు. వాటిపై వివాదం తలెత్తడంతో ఆ భూముల్ని తిరిగిచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో సకల శాఖల మంత్రిగా చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డిపైనా అటవీ భూముల్ని ఆక్రమించుకుని భవంతి కట్టుకున్నట్టు ఆరోపణలు వచ్చాయని తెలిపారు. ఇక పెద్దిరెడ్డి గురించి చెప్పేదేముంది? గుడినీ, గుడిలో లింగాన్నీ కలిపి మింగేయడంలో అందె వేసిన వైసీపీ నేతలకు ఆయన పెద్దన్న. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు, అటవీ, విద్యుత్ వంటి కీలక శాఖలకు మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి ప్రకృతి వనరుల్ని చెరబట్టారని తెలిపారు. ఆయన అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించి, రూ.వేల కోట్లు వెనకేసుకున్నారని తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయన చేసిన అరాచకాలు ఒకెత్తైతే… చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి, ఆయన సోదరుడు ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు, తంబళ్లపల్లెతో పాటు చుట్టుపక్కల మరికొన్ని నియోజకవర్గాల్లో పెద్దిరెడ్డి కుటుంబం చేసిన అరాచకాలు మరో ఎత్తు. ఆ ప్రాంతాన్ని తన సామ్రాజ్యంగా మార్చేసుకుని.. ఒక నియంతలా చెలరేగిపోయార్న ఆరోపణలున్నాయన్నారు. జగన్ జమానాలో రాష్ట్రంలోని రోడ్లన్నీ భారీ గుంతలతో, అస్తవ్యస్తంగా ఉండి, ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే చూస్తుూ ఉన్నాడే తప్ప కనీస మరమ్మతులు కూడా చేయలేదు. పెద్దిరెడ్డి మాత్రం అటవీశాఖ మంత్రిగా ఉండీ… అడవి మధ్యలోని తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లేందుకు రొంపిచెర్ల మార్కెట్ కమిటీ నిధులతో నిబంధనలకు విరుద్ధంగా తారు రోడ్డు వేసేసుకున్న ఘనుడు పెద్దిరెడ్డి అన్నారు.
అదేమైనా మీ సొంత జాగీరా!
పెద్దిరెడ్డి నిర్మించుకున్న సువిశాల వ్యవసాయక్షేత్రం ఎన్ని ఎకరాల్లో ఉందన్న కచ్చితమైన లెక్కలు అటవీ, రెవెన్యూశాఖల దగ్గర లేవని, ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నన్నాళ్లూ అక్కడ ఎన్ని అరాచకాలు జరుగుతున్నా అధికారులు కన్నెత్తి చూసేందుకు కూడా సాహసించలేదంటే ఆయన ఎటువంటి వాడే తెలుస్తుందని ఎమ్మెల్యే బొజ్జల తెలిపారు. ఆ లెక్కలు తేలాలంటే రెవెన్యూ, అటవీశాఖలు సంయుక్త సర్వే చేయించాలని చెప్పారు. 295, 296 సర్వే నంబర్లను ఎప్పుడు సబ్డివిజన్ చేశారు? అక్కడ ఉన్న భూమి కంటే అదనంగా పెద్దిరెడ్డి కుటుంబం పేరు మీద ఎప్పుడు ఎక్కించారు? ఎవరు సహకరించారు? అన్న విషయాలు నిగ్గుతేలాల్సి ఉందన్నారు. అటవీ భూమిని ఆక్రమించుకోవడమే కాకుండా అదేదో సొంత జాగీరు అన్నట్లు చుట్టూ 15-20 అడుగుల ఎత్తున కంచె వేసేశారని, రక్షిత అటవీ ప్రాంతంలో వన్యప్రాణులు తిరిగే చోట ఇనుపకంచె వేసి వాటి స్వేచ్ఛను హరిస్తున్నారన్నారు. దీంతో అవి అటవీ ప్రాంతాన్ని అనుకుని ఉన్న రైతుల పొలాల్లోకి వెళ్లి పంటలు నాశనం చేస్తున్నాయి. పుంగనూరు నియోజకవర్గంలో ఏనుగుల తాకిడి అధికంగా ఉంది. పెద్దిరెడ్డి వ్యవసాయ క్షేత్రమున్న ప్రాంతంలోనూ తరచూ ఏనుగులు సంచరిస్తుంటాయని, అంతేకాదు.. అడపాదడపా పులులూ తిరుగుతుంటాయన్నారు. గతంలో ఆయన పొలంలో పనిచేస్తున్న వ్యక్తిపై చిరుత దాడి చేసిందనే ప్రచారం కూడా జరిగిందని చెప్పారు. అక్కడ 300 నుంచి 400 ఆవుల్ని కూడా పెంచుతున్నారు. వాటి కోసం భారీ షెడ్లు వేశారు. ఆవుల్ని మేత కోసం అడవిలోకి తోలుతున్నారన్నారు.
విలాసవంతమైన భవంతి
వైసీపీ పార్టీ అధినేత జగన్కు విలాసవంతమైన భవనాలు ఉన్నప్పుడు… నం.2గా వెలుగుతున్న తానేం తక్కువ తిన్నాననుకున్నారో ఏమో ఆ వ్యవసాయక్షేత్రంలో పెద్దిరెడ్డి విలాసవంతమైన భవంతిని కట్టేశారని ఎమ్మెల్యే బొజ్జల తెలిపారు. అలాగే దాని చుట్టూ ఫెన్సింగ్ వేసి, పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేసుకున్నారని, పెద్దిరెడ్డి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లే మార్గం ఒకప్పుడు సన్నని కాలిబాటగా ఉండేది. అప్పుడప్పుడు ఎడ్లబళ్లు మాత్రం వెళ్లేవని, అయితే పెద్దిరెడ్డి మంత్రిగా ఉండగా మార్కెట్ యార్డు నిధులతో తారు రోడ్డు నిర్మించారని చెప్పారు. గ్రామం నుంచి పెద్దిరెడ్డి వ్యవసాయ క్షేత్రం వరకు సుమారు 6.5 కి.మీ. దూరం ఉంటుంది. అందులో 5 కి.మీ.ల దూరం వరకు అటూ ఇటూ పొలాలున్నాయి. మిగతా ఒకటిన్నర కిలోమీటర్ల రోడ్డు.. కేవలం పెద్దిరెడ్డి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లేందుకే వేశారని తెలిపారు. ఆయన మంత్రిగా ఉండగా ఆ ఎస్టేట్ కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండేది. అటువైపు చీమను కూడా చొరబడనిచ్చేవారు కాదు. పండుగలు, ఇతర సందర్భాల్లో పెద్దిరెడ్డి అక్కడికి వెళుతుంటారని, అలాంటప్పుడు భారీగా పోలీసుల్ని మోహరించేవారు. ఎస్టేట్ వరకు ఉన్న రహదారి వెంట ఎవరైనా పొరపాటున వెళితే అడ్డుకుని, సవాలక్ష ప్రశ్నలు వేసేవారు. వ్యవసాయ క్షేత్రం లోపలికి వెళ్లాలంటే రెండు గేట్లు దాటాలి. అడుగడుగునా నిఘా ఉండేదన్నారు.
ఆ సర్వే నంబర్లలోని భూమి అదేనా?
మంగళంపేటను ఆనుకుని ముంగిలిపట్టు రక్షిత అటవీ ప్రాంతంలో పెద్దిరెడ్డి వ్యవసాయ క్షేత్రం 295, 296 నంబరు సర్వే నంబర్లలోనే ఉందా? లేకపోతే ఆ సర్వే నంబర్లలోని భూమి ఒకచోట ఉంటే, పెద్దిరెడ్డి కుటుంబం మరోచోట అటవీ భూమి అక్రమించి వ్యవసాయ క్షేత్రం నిర్మించిందా? అన్న అనుమానాలూ ఉన్నాయని ఎమ్మెల్యే బొజ్జల అన్నారు. 1952 నాటి సర్వే ప్రకారం రూపొందించిన గ్రామ పటం, శాటిలైట్ మ్యాప్స్ ప్రకారం చూస్తే ఆ రెండు సర్వే నంబర్లలోని భూమి ఊరికి దగ్గరగా కనిపిస్తుండగా, పెద్దిరెడ్డి వ్యవసాయక్షేత్రం మాత్రం అక్కడికి చాలా దూరంగా ఉందని తెలిపారు. దీనిలో లోగుట్టు బయటపడాలంటే లోతైన దర్యాప్తు జరగాలని కోరారు.
**భూ అక్రమణల వివరాలు…
భూ ఆక్రమణ వివరాలు తెలియజేస్తూ మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో గ్రామానికి చాలా దూరంగా అడవిలో 295 సర్వే నంబరులో 17.69 ఎకరాలు, 296 సర్వే నంబరులో 6 ఎకరాల పట్టా భూమి ఉన్నట్లు ఫెయిర్ అడంగల్, ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ (ఎఫ్ఎంబీ)లో స్పష్టంగా రికార్డు అయ్యిందని, దానికి సరిహద్దులుగా రిజర్వు ఫారెస్ట్ ఉన్నట్టు రికార్డుల్లో ఉందవి, 1952లో చేసిన సర్వే ప్రకారం రూపొందించిన రికార్డులు అన్నారు. ఆ రెండు సర్వే నంబర్లలోని పట్టా భూమి మొత్తం పెద్దిరెడ్డి కుటుంబం స్వాధీనంలో ఉంది. వాటిలో పెద్దిరెడ్డి కుటుంబానికి ఎంత భూమి ఉంటుందని అడిగితే.. ఎవరిని అడిగినా 17.69+ 6= 23.69 ఎకరాలనే కదా చెబుతారు. అవే సర్వే నంబర్లలో (తర్వాత సబ్డివిజన్ చేశారు) పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు మిథున్రెడ్డి, పెద్దిరెడ్డి లక్ష్మీరెడ్డి, పెద్దిరెడ్డి ఇందిరమ్మల పేరు మీద 2000, 2001 సంవత్సరాల్లో 45.8 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ జరిగిందని చెప్పారు. దేశిరెడ్డి సర్వేశ్వర్రెడ్డి, చెంగారెడ్డి, శ్రీరాములురెడ్డి, మంగమ్మల నుంచి వారు ఆ భూమి కొన్నట్లు రిజిస్ట్రేషన్ పత్రాల్లో ఉంది. అంటే 23.69 ఎకరాల భూమి.. 45.8 ఎకరాలకు పెరిగిందని, ఈ గ్రోత్ అంతటితో ఆగలేదు. రెవెన్యూ రికార్డుల్లో (అడంగల్)లో 295/1ఎ, 295/1బి, 295/1సి, 295/1డి, 296/1, 296/1బి సర్వే నంబర్లలో పెద్దిరెడ్డి, ఆయన కుటుంబసభ్యుల పేరు మీద 75.75 ఎకరాల భూమి ఉన్నట్టు నమోదైంది. ఇక్కడ 45.8 ఎకరాలు కాస్తా 75.75 ఎకరాలకు పెరిగిందన్నమాట! 295/1ఇ సర్వే నంబర్లో ఉన్న మరో 1.8 ఎకరాల్ని అడంగల్లో ‘డమ్మీ’గా చూపించారని చెప్పారు. పెద్దిరెడ్డి కుటుంబం అటవీ భూమిని భారీగా కబ్జా చేసిందని, ఆ 75.75 ఎకరాలతో పాటు, మరో 30 ఎకరాల వరకు వారి ఆధీనంలో ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.
ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలవా పెద్దిరెడ్డి …
మంగళంపేట రెవెన్యూ పరిధిలో పెద్దిరెడ్డి కుటుంబం భూములున్న ప్రాంతానికి పక్కనగానీ, అక్కడికి సమీపంలోగానీ ఇంకెవరికీ పట్టా భూముల్లేవు. పెద్దిరెడ్డి కుటుంబానికి మాత్రమే అడవి మధ్యలో పట్టాభూములు ఎలా వచ్చాయని బొజ్జల ప్రశ్నించారు. 295, 296 సర్వే నంబర్లలో ఎఫ్ఎంబీ, ఫెయిర్ అడంగల్ ప్రకారం 23.69 ఎకరాలుంటే, 75.75 ఎకరాలున్నట్టు ఆన్లైన్లో ఎలా నమోదు చేశారు? అదనంగా 52.06 ఎకరాల భూమి ఎక్కడి నుంచి వచ్చింది? అటవీ భూమిని ఆక్రమించుకుని పట్టాభూమిలో కలిపేసుకున్నారా? రెవెన్యూ అధికారుల్ని మేనేజ్ చేసి ఆన్లైన్లో ఎక్కించుకున్నారా? 295, 296 సర్వే నంబర్లను ఎందుకు సబ్డివిజన్ చేశారు? అని ప్రశ్నించారు. అలాగే 295/1ఎలో పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పేరిట 2009 జులై 1న 10 ఎకరాల్ని ఆన్లైన్లో ఎంటర్ చేశారని, 2017 అక్టోబరు 24న దానిలో మార్పులు చేసి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు మీదకు మార్చారని, 10 ఎకరాలు కాస్తా ఈసారి 15 ఎకరాలు అయిపోయింది? ఇదెలా సాధ్యమైంది ? 295/1సి సర్వే నంబరులో ఎన్.షంషుద్దీన్ పేరిట ఉన్న 15 ఎకరాల్ని 2010 జులై 1న పి.లక్ష్మణరెడ్డి పేరు మీద రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేశారని, ఆ భూమి 2015 మే 26న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు మీదకు మారిందని తెలిపారు. 2017 అక్టోబరు 24న పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పేరు మీదకు మారింది. ఈసారి 15 ఎకరాలు కాస్తా 21 ఎకరాలకు పెరిగింది? ఇదెక్కడి చోద్యం అని ప్రశ్నించారు. పెద్దిరెడ్డి కుటుంబం ఆన్లైన్లో అదనంగా ఎక్కించుకున్న భూములతోపాటు, మరో 30 ఎకరాల వరకు ఆక్రమించుకుందని, ఆ కుటుంబానికి అక్కడ 100 ఎకరాల వరకు భూములున్నాయని నిఘా విభాగం చెబుతోందని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్రెడ్డి తెలిపారు.
*ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన వ్యక్తి రసూల్ బేగ్*


ఏ గురువు పేరు పలికితే ఆ గురువు పనిచేసిన పాఠశాల కళ్ళముందు కనిపిస్తుందో , ఏ పాఠశాల పేరు పలికితే ఆ గురువు మాత్రమే గుర్తుకొస్తారో వారే ఉత్తమ ఉపాధ్యాయులని, ఆ వరుసలో మొట్టమొదట కనిపించే అత్యుత్తమ గురువు మన మొఘల్ రసూల్ బేగ్ అని ఎంఈవోలు 1& 2 మాల్యాద్రి, శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన పదవీ విరమణ సందర్బంగా స్థానిక పార్కు వీధి పాఠశాలలో ఉద్యోగ విరమణ అభినందన సన్మాన సభను భారీ ఏర్పాట్లతో ఘనంగా నిర్వహించారు. గత 37 సంవత్సరాలుగా ఓనమాలను ఊయలూపుతూ, జ్ఞాన శిఖరాలను పేర్చి కూర్చి, ఓర్పుకు…ఉపమానమై
తీర్పుకు…ఉపమేయమై అందరి హృదయాలలో అచ్చు వేయబడిన ఆది గురువుగా ఆయన నిలిచివుంటారని వక్తలు కొనియాడారు. సొంత నిధులతో వినూత్న బోధానోపకరణాలను రూపొందించి విద్యా విలువలకు అలంకారాలద్దిన త్యాగనిరతి ఆయన సొంతమని, నీతి, నిజాయితీ,నిరాడంబరత, ఓర్పు నేర్పుల నిలువెత్తు రూపమే ప్రధానోపాధ్యాయులు రసూల్ బేగ్ అని , గురువుగా వారి ఘనతను ప్రశంసించేందుకు పదాలు సరిపోవని అన్నారు.ఆయన పనిచేసిన పాఠశాలకు ప్రత్యేక గుర్తింపును తీసుకురావడంలో ఆయన కృషి ప్రశంసనీయమంటూ అభినందనలతో ముంచెత్తారు. ఈ సందర్బంగా ప్రధానోపాధ్యాయులు మొఘల్ రసూల్ బేగ్ మాట్లాడుతూ ఉద్యోగ ప్రయాణంలో అనుక్షణం వెన్నంటి, తన ఉనికికి ఊతగా నిలిచిన అర్ధాంగి సేవలను, సమయస్ఫూర్తిని వివరిస్తూ,తన విజయం వెనుక రహస్యాన్ని వెల్లడించారు. ఈరోజుతో బడికి దూరమవాలన్న బాధను వ్యక్తం చేస్తూ ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. అనంతరం బంధువులు, ఎంఈవోలు, మాజీ ఎంఈవోలు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు, పలువురు ఉన్నతాధికారులు, ఎంఈఓ కార్యాలయ సిబ్బంది శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించి బహుమతులను అందించారు. కార్యక్రమంలో
యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ హై, స్టేట్ కౌన్సిలర్ ఒ.వీ .వీరారెడ్డి, యుటిఎఫ్ నాయకులు వి వెంకటేశ్వర్లు, ఖాసిం కేశవ ,రాధాకృష్ణ ,సునీల్, వేణు, తిరుపతయ్య, సుబ్రహ్మణ్యం రాజేష్, పాండురంగారావు చంద్రశేఖర్ రెడ్డి, జలీల్, రఫీ తో పాటు పలువు యుటిఎఫ్ నాయకులు, ఇతర సంఘాల నాయకులు పాల్గొన్నారు
👉హైదరాబాద్: వారసిగూడలో దారుణం..ఇంట్లో గుండెపోటుతో లలిత అనే మహిళ మృతి..మృతదేహంతో 8 రోజులుగా ఇంట్లో గడిపిన ఇద్దరు కూతుర్లు..దహన సంస్కారాలకు డబ్బులు లేవంటూ..8 రోజుల తర్వాత ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లిన కూతుర్లు..పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించిన ఎమ్మెల్యే…పోలీసులకు సమాచారం ఇచ్చిన ఇద్దరు కూతుర్లు.
👉తిరుపతి, జనవరి31: శుక్రవారం సాయంత్రం స్థానిక జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం నందు కుప్పయ్య తహశీల్దార్ పదవీ విరమణ వీడ్కోలు సభ నిర్వహించగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్, జెసి శుభం బన్సల్, డిఆర్ఓ నరసింహులు, రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులు, పలువురు కలెక్టరేట్ సిబ్బంది హాజరయ్యారు. వీడ్కోలు సన్మాన గ్రహీత కుప్పయ్య దంపతులను ఘనంగా సన్మానించి పలువురు వీడ్కోలు పలికారు.

